‘భీష్మ’ సక్సెస్ గ్యారంటీ: త్రివిక్రమ్

Bheeshma pre release function

యువ కథానాయకుడు నితిన్ టైటిల్ రోల్ పోషించిన ‘భీష్మ’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ సోమవారం యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో అభిమానులు, శ్రేయోభిలాషుల సమక్షంలో కన్నుల పండువగా జరిగింది. ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో రష్మికా మందన నాయిక. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకుడు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, “వెంకీ తీసిన ‘ఛలో’ చూసినప్పుడే అతని ఎంటర్టైన్మెంట్ స్కిల్, అతని విజన్ అర్థమైంది. ‘శ్రీనివాస కల్యాణం’ చేసేటప్పుడు నితిన్ ఈ కథ చెప్పాడు. అప్పుడే కచ్చితంగా ఒక మంచి సినిమా తీస్తారని అర్థమైంది. మొన్న సినిమా చూశాక చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఎంత నవ్వించాలో అంత నవ్వించారు. ఆడియెన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నితిన్ డాన్సులు ఇరగదీశాడు. సినిమా అంతా నితిన్ ను రష్మిక ఆడుకుంటూనే ఉంది. స్వరసాగర్ ఇచ్చిన మ్యూజిక్ అద్భుతం. అన్ని పాటలూ బాగున్నాయ్. అతను మణిశర్మగారి పేరు నిలబెడుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్. ‘అల.. వైకుంఠపురములో’ ఎంత పెద్ద హిట్టయ్యిందో మనకు తెలుసు. ఆ సినిమాతో పోటీపడేలా ఈ సినిమాలో విజువల్స్ ఉన్నాయి. ఫిబ్రవరి 21న వస్తున్న ఈ సినిమా డెఫినెట్ గా హిట్టవుతుంది” అని చెప్పారు.

డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ, “త్రివిక్రమ్ గారికి నేను భక్తుడ్ని. ఆయన దగ్గర ఎప్పట్నుంచే పనిచేద్దామని అనుకుంటున్నప్పుడు ‘అ ఆ’ సినిమాకు ఆయన దగ్గర నన్ను చేర్పించింది నిర్మాత చినబాబు గారే. వాళ్లిద్దరికీ థాంక్స్. ఈ సినిమా కథకు సమయం పట్టింది. అందువల్లే నితిన్ ఫ్యాన్స్ ను వెయిట్ చేయించాల్సి వచ్చింది. అయితే వెయిట్ చేసినందుకు సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాపై నేను చాలా నమ్మకంగా ఉన్నాను.

!హీరోయిన్ రష్మికా మందన్న మాట్లాడుతూ, “ఈ తరంలో నిజమైన ఫ్రెండ్స్ ఉండటం చాలా కష్టమైపోతోంది. కానీ ఈ సినిమాకి పనిచేసేటప్పుడు నేను జెన్యూన్ పీపుల్ ని కలిశాను. వెంకీ కుడుముల అలాంటి వ్యక్తి. ఈరోజు టాలీవుడ్ లో నేనిక్కడ ఉన్నానంటే ఒక ప్రధాన కారణం ఆయనే. ‘భీష్మ’ స్క్రిప్టును ఆర్గానిక్ వ్యవసాయం నేపథ్యంతో ఆయన రాసుకున్నారు. ఈ సినిమాని ఆయన తీస్తున్న విధానం చూసి నేను సరెండర్ అయిపోయా. పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి.

హీరో నితిన్ మాట్లాడుతూ, “నా మునుపటి సినిమాకూ, ఈ సినిమాకూ దాదాపు ఒక సంవత్సరం గ్యాప్ ఉంది. స్క్రిప్ట్ మొత్తం పక్కాగా రెడీ అయ్యేవరకు సినిమా మొదలుపెట్టకూడని అనుకున్నాను. వెంకీ ఫుల్ స్క్రిప్ట్ చెప్పేవరకు ఆగి అప్పుడు మొదలుపెట్టాం. ఫిబ్రవరి 21న సినిమా వస్తోంది. వెంకీ ‘దిల్’ సినిమాకు, నాకూ పెద్ద అభిమాని అంట. ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుందని చెప్పాడు. చెప్పినట్లే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి, ‘దిల్’, ‘సై’ తర్వాత మళ్లీ అలాంటి యాంగిల్లో నన్ను చూపించాడు. నా ఫ్యాన్స్ అందరూ ఎప్పుడూ ‘డ్యాన్సన్నా.. డ్యాన్సన్నా’ అని అడుగుతున్నారు. ఈ సినిమాలో నేను చేసిన డ్యాన్స్ చూసి అభిమానుల ఆకలి తీరుతుందని అనుకుంటున్నా. కానీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నా బెండు తీసేశాడు. శేఖర్ మాస్టర్ కూడా బాగా చేయించారు. సెకండాఫ్ లో వచ్చే ఫైట్ ను ఫైట్ మాస్టర్ వెంకట్ అదరకొట్టేశారు. ఆ ఫైట్ లో ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ గ్యారంటీ. ఆ ఫైట్ కు స్వరసాగర్ ఇచ్చిన రీరికార్డింగ్ ఫోన్ లో చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ సినిమాకు లైఫ్ లాగా నిలిచే సాంగ్స్ ఇచ్చాడు. భవిష్యత్తులో తండ్రికి తగ్గ తనయుడిగా తను పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా.

మాంత్రికుడు, సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ, “నితిన్ కు వాళ్లన్నయ్య పవన్ కల్యాణ్ ఆశీస్సులెప్పుడూ ఉంటాయ్. ఆయన తరపునా, ఆయన అభిమానులందరి తరపునా నితిన్ కు ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ వెంకీ కుడుముల, సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ మహతి.. మిగతా అందరికీ అభినందనలు చెబుతున్నా. ఇప్పటికే నేను సినిమా చూశాను. చాలా చాలా బాగుంది. 21న అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నమ్మకంగా చెబుతున్నా. రష్మిక ‘సరిలేరు నీకెవ్వరు’తో మంచి సక్సెస్ మార్గంలో ఉంది. ఇప్పుడు ‘భీష్మ’ వస్తోంది. ఆమెకు మరిన్ని విజయాలు రావాలి.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com