ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క
హైదరాబాద్ః అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపిస్తున్నారు. మార్పును కోరుతూ తెలంగాణ ప్రజలు మా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.
సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ను రూపొందించాం. నిస్సహాయులకు సహాయం చేయడమే మా విధానం. దశాబ్దాల ఆకాంక్షను గౌరవిస్తూ 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది యూపీఏ ప్రభుత్వం. సమానత్వమే మా లక్ష్యం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి ఏ మాత్రం వెనుకాడం. నిర్బంధాలు, నియంతృత్వ దోరణులు ఉండవని చెప్పాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం.
రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులతో అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆర్థికంగా ఎంత వెనుకబడిపోయామంటే.. ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితి. దీనివల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని, జీవితాలను దుర్బరం చేసిన పాలనకు స్వస్తి పలికారు. దివాలా తీసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తున్నాం.