తెలంగాణ వచ్చినా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదుః భట్టి విక్రమార్క

bhatti-vikramarka-election-campaign-in-madhira

హైదరాబాద్‌ః తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. నిన్నటి దాకా ఆరు గ్యారెంటీలతో ప్రచారాన్ని హోరెత్తించిన హస్తం అభ్యర్థులు ఇప్పుడు అభయహస్తం మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఇంతకుముందు కంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని జోష్​లో ఉన్న నేతలు ప్రచారంలోనూ దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురంలో ప్రచారంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఆయనకు మద్దతుగా టిడిపి, సీపీఐ, వైఎస్‌ఆర్‌టిపి కార్యకర్తలు ప్రచారానికి వచ్చారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చినా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని అన్నారు. నవంబర్‌ 30న జరిగే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయిస్తాయని తెలిపారు. ప్రజల తెలంగాణకు, దొరల తెలంగాణకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని వెల్లడించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే మధిరకు అధిక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.