అల్లూరి సీతారామరాజుకు భారతరత్న ప్రకటించాలని పవన్ డిమాండ్

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్దంతి సందర్బంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనను స్మరించుకున్నారు. వీరులకు పుట్టుకే కానీ గిట్టుక ఉండదని, వారి చైతన్యం సదా ప్రసరిస్తూనే ఉంటుందని తెలిపారు. వారు రగిల్చిన విప్లవాగ్ని ఎప్పటికీ ఆరిపోదని పేర్కొన్నారు. అటువంటి ధీరుడే మన అల్లూరి సీతారామరాజు అని వెల్లడించారు.

ఆ మహా యోధుడు వీరమరణం పొంది నేటికి వందేళ్లు అని పవన్ పేర్కొన్నారు. నేటి తరం దేశవాసులందరికీ అల్లూరి సీతారామరాజు సంకల్పం, పోరాట పటిమ, మృత్యువుకు భయపడని నైజం, జ్ఞాన-ఆధ్యాత్మిక సంపదల గురించి తెలియాలని అభిప్రాయపడ్డారు. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలని సూచించారు. అల్లూరి సీతారామరాజుకు భారతరత్న ప్రకటించి ఆ పురస్కారానికి మరింత వన్నె అద్దాలని పవన్ కల్యాణ్ కోరారు. అల్లూరి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. జనసేన అధికారంలోకి వస్తే ఆ బాధ్యతను తాము స్వీకరిస్తామని పవన్ ప్రకటించారు. అల్లూరి స్ఫూర్తిని దేశమంతా చాటాలని జనసేనాని పిలుపునిచ్చారు.