రేపు హైదరాబాదులో యువ సంఘర్షణ సభ..హాజరుకానున్న ప్రియాంక గాంధీ

రేపు(సోమవారం) సరూర్‌నగర్‌లోని ఇండోర్‌ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులతో యువ సంఘర్షణ సభ నిర్వహించబోతుంది. ఈ సభ కు ముఖ్య అతిధిగా ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రియాంకగాంధీ శంషాబాద్ చేరుకుంటారు. అక్కడ్నించి ప్రత్యేక హెలికాప్టర్ లో సరూర్ నగర్ పయనమవుతారు. సాయంత్రం 4.30 గంటలకు సరూర్ నగర్ సభలో ప్రియాంక ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు ప్రియాంక గాంధీ సభ నుంచి తిరుగు పయనమవుతారు.

కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకొని సరూర్ నగర్ లో యువ సంఘర్షణ సభకు హాజరు కానున్నారు. ప్రియాంక తొలిసారి తెలంగాణకు వస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రియాంక కేవలం గంటన్నర మాత్రమే పర్యటిస్తారని, సభలో యువ డిక్లరేషన్ ప్రకటిస్తారని నేతలు తెలిపారు.

తెలంగాణ కాంగ్రెస్‌ మేనిఫెస్టో, యూత్‌ డిక్లరేషన్‌ను విడుదల చేయనున్నట్లు చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలను ఆదుకోలేకపోయిందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో, నిరుద్యోగభృతి ఇవ్వడంలో విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే నిరుద్యోగులకు సరైన న్యాయం జరుగుతుందన్నారు. యువ సంఘర్షణ సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలి రావాలని కోరారు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు సున్నపు వసంతం తెలిపారు.