రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ఖరారు
జైపూర్ : రాజస్థాన్ ముఖ్యమంత్రి పేరును బిజెపి అధిష్టానం ఖరారు చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ పేరును ఫైనల్ చేసింది. బిజెపి శాసనసభ పక్ష సమావేశంలో భజన్లాల్ శర్మను సీఎంగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురుచూసిన వసుంధర రాజేను బిజెపి అధిష్టానం పక్కన పెట్టింది. భజన్ లాల్ శర్మ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. తొలిసారిగా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా కొత్తవారికే సీఎంగా అవకాశం ఇచ్చింది బిజెపి అధిష్టానం.
ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగనేర్ నియోజకవర్గం నుంచి శర్మ గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్పై 48,081 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే సీఎం రేసులో వసుంధర రాజే, గజేంద్ర షెకావత్, మహంత్ బాలాకాంత్, దియా కుమారి, అనిత భదేల్, మంజు బఘ్మర్, అర్జున్ రామ్ మేఘ్వాల్ కూడా ఉన్నారు. కానీ చివరికి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన భజన్ లాల్ శర్మకు సీఎం పదవి వరించింది.