హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత

హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో అరుదైన రాయల్‌ బెంగాల్‌ జాతికి చెందిన మగ తెల్లపులి మంగళవారం మృత్యువాత పడింది. 9 ఏళ్ల వయస్సు ఉన్న అభిమన్యు అనే పేరు గల ఈ పెద్ద పులి గతకొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోంది.

2015 జనవరి 2న జన్మించిన అభిమన్యు.. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ..మంగళవారం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో చివరికి ప్రాణాలు వదిలింది. ఈ నెల 12న అభిమన్యు ఆహారం తీసుకోలేదు. రెండు కిడ్నీలు పాడైపోవడంతో మంగళవారం మృత్యువాత పడింది. పోస్టుమార్టం నివేదికలో మూత్రపిండాలు పాడైపోయినట్లు తేలిందని జూ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం జూలో మొత్తం పులులు 18 ఉన్నాయి. అందులో తెల్లపులులు 8 ఉన్నాయి.