ట్రంప్పై సెనెట్లో అభిశంసన ప్రారంభం
వాషింగ్టన్: అమెరికన్ సెనేట్ ట్రంప్ అభిశంసన లాంఛనంగా ప్రారంభించింది. నిష్పాక్షిక న్యాయమూర్తుల్లా వ్యవహరిస్తామని అమెరికన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ సెనేటర్లతో ప్రమాణం చేయించడంతో ఈ అభిశంసన ప్రక్రియ మొదలైంది. దిగువ సభ అయిన ప్రతినిధుల సభ డిసెంబరు 18న అభిశంసన తీర్మానాన్ని 233198 ఓట్లతేడాతో ఆమోదించింది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి గెలవడానికి అక్రమంగా ఉక్రెయిన్ సాయాన్ని కోరడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేది ట్రంప్పై వచ్చిన మొదటి అభియోగం. సభలో అభిశంసన దర్యాప్తునకు ఆటంకం కలిగించేలా సాక్షులను, పత్రాలను తొక్కిపట్టేందుకు ప్రయత్నించారనేది రెండవ అభియోగం. ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో అభిశంసనపై విచారణ ఏ మేరకు నిష్పాక్షికంగా సాగుతుందన్నది ప్రశ్నార్థకమే. అభిశంసనపై తీర్పు చెప్పే సెనెటర్లలో నల్గురు అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్తో తలపడేందుకు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రస్తుతం పోటీపడుతున్నారు. ఈ విధంగా అభిశంసన విచారణ ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుల్లో ట్రంప్ మూడవ వాడు.సెనేట్ సభ్యులు ప్రతిజ్ఞ చేసి కూర్చొన్న వెంటనే ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన ప్రారంభమైన సభలో ట్రంప్పై అభిశంసన అభియోగాలను హౌస్ ప్రాసిక్యూటర్లు బిగ్గరగా చదివి వినిపించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/