అసలు కిషన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారుః బండి సంజయ్

కెసిఆర్ నియంతృత్వానికి పరాకాష్ఠ అన్న బండి సంజయ్

bandi-sanjay

హైదరాబాద్‌ః బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అరెస్టును కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించారు. ఇది కెసిఆర్ నియంతృత్వానికి పరాకాష్ఠ అని బండి సంజయ్ అన్నారు. అసలు కిషన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారని నిలదీశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇళ్లు కట్టలేదు కానీ 100 గదుల ఇంటిలో కెసిఆర్ ఉంటున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కు నిజాయితీ ఉంటే డబుల్ బెడ్రూం ఇళ్లపై క్లారిటీ ఇవ్వాలన్నారు.

కిషన్ రెడ్డిని అడ్డుకొని అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని ధర్మపురి అరవింద్ అన్నారు. కిషన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో కేసీఆర్ చెప్పాలన్నారు. కిషన్ రెడ్డిపై లిక్కర్ మాఫియా, డ్రగ్స్ మాఫియా, బాలీవుడ్ వాళ్లతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోన పథకం కింద 4 కోట్ల ఇళ్లు నిర్మితమయ్యాయన్నారు. కానీ తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్ల పరిస్థితి ఏమిటన్నారు. గృహ నిర్మాణ శాఖలో 1,821 మందికి 500 మంది మాత్రమే సిబ్బంది ఉన్నారన్నారు. గృహ నిర్మాణ శాఖ బంద్ అయితే పని ఎలా జరుగుతుందన్నారు.