హైదరాబాద్లో రేపు వైన్ షాపుల బంద్.. 144 సెక్షన్!
![Wines bandh for three days in AP](https://www.vaartha.com/wp-content/uploads/2023/11/wine-shops-bandh-in-telangana-for-three-days-jpg.webp)
హైదరాబాద్ః రేపు పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో భాగ్యనగరంలో వైన్ షాపులు మూతపడనున్నాయి. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యగా రేపు ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఐదుగురికి మించి ఒకచోట గుమికూడకుండా ఆంక్షలు ఉంటాయన్నారు. మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేయాలని, ఎవరైనా అక్రమంగా మద్యం నిల్వ చేసి అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.
కాగా, తెలంగాణలో గత నెల 13వ తారీఖున లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం ఓట్ల లెక్కింపునకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా మల్కాజ్గిరి, చేవెళ్ల, హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 19 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.
కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక కౌంటింగ్ కేంద్రాల్లోకి ఈసీ జారీ చేసిన పాసులు ఉన్న సిబ్బంది, వివిధ పార్టీల అభ్యర్థుల ఏజెంట్లు, మీడియా ప్రతినిధులను మాత్రమే అనుమతించనున్నారు.