అంగళ్లు అల్లర్ల కేసు.. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

కేసులో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం

backlash-to-ap-govt-in-supreme-court-in-angallu-case

న్యూఢిల్లీ్‌ః ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు అల్లర్ల కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురయింది. ఈ కేసులో నిందితులకు ఏపీ హైకోర్టు బెయల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు… హైకోర్టు తీర్పును సమర్థించింది. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ విషయంలో జోక్యం చేసుకోబోమని సుప్రీం స్పష్టం చేసింది. ఈ కేసులో ఒక పోలీసు అధికారి గాయపడ్డారని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు పట్టించుకోలేదు.

ఈ కేసులో దేవినేని ఉమా, చల్లా బాబు, నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, పులివర్తి నానిలతో సహా దాదాపు 41 మందికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ దశలో ఈ కేసు విచారణలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీం స్పష్టం చేసింది. ఈ పిటిషన్ ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. మరోవైపు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై కూడా ఈరోజు ఇదే ధర్మాసనం విచారణ జరపబోతోంది.