బిఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫై రాళ్ల దాడి

ఎన్నికల ప్రచారంలో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ బిఆర్ఎస్ – కాంగ్రెస్ వర్గీయుల మధ్య దాడులు జరుగుతున్నాయి. కొద్దీ రోజుల క్రితం బిఆర్ఎస్ ఎంపీ , దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఫై కత్తి దాడి జరుగగా..తాజాగా శనివారం రాత్రి మరో బిఆర్ఎస్ అభ్యర్థి ఫై రాళ్ల దాడి జరిగింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్‌ వర్గీయులు రాళ్ల దాడి చేసారు. ఈ దాడిలో గువ్వల బాలరాజు గాయపడ్డారు.

ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తన కారులో డబ్బులు తరలిస్తున్నారంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆరోపిస్తూ.. ఆందోళనకు దిగారు. అలాగే ఎమ్మెల్యే కారును అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు వర్గీయులు రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ సమాచారమందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరుపార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. కాగా ఇరుపార్టీల కార్యకర్తల ఘర్షణలో ఎమ్మెల్యే బాలరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను అక్కడినుంచి ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ కార్యకర్తలు తనపై దాడి చేశారంటూ స్థానిక పోలీస్ స్టేషన్‏లో ఎమ్మెల్యే బాలరాజు ఫిర్యాదు చేశారు.