ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరు..సమన్లు వాపస్ తీసుకోవాలంటూ లెటర్ !

రాజకీయ దురుద్దేశంతోనే నోటీసులు పంపారని ఆరోపణ

Arvind Kejriwal Skips Summons, Writes “Take Back Notice” To Probe Agency

న్యూఢిల్లీః విచారణకు రమ్మంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పంపిన నోటీసులపై ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ తొలిసారిగా స్పందించారు. ఈ నోటీసుల వెనక కేంద్రంలోని కొంతమంది పెద్దల కుట్ర ఉందని, తనను ఎన్నికల ప్రచారానికి దూరం చేయడమే వారి లక్ష్యమని ఆయన ఆరోపించారు. నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ఈడీకి ఆయన లేఖ రాశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు పంపించింది. గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశించింది. ఈ నోటీసులపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేతలు, ఢిల్లీ ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు. కేజ్రీవాల్ ను అరెస్టు చేసి జైలులో పెట్టాలని కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడుతున్నారు.

కాగా, ఈడీ విచారణకు కేజ్రీవాల్ హాజరు కావడంలేదని సమాచారం. ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసుకు వెళ్లాల్సి ఉండగా.. విచారణకు డుమ్మా కొట్టి మధ్యప్రదేశ్ కు వెళుతున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ మేరకు మధ్యప్రదేశ్ లో జరిగే ర్యాలీకి హాజరవుతారని ఆప్ నేతలు చెబుతున్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను గతంలో సీబీఐ అధికారులు విచారించారు. అయితే, ఈడీ నోటీసులు పంపడం ఇదే మొదటిసారి.