వాహనదారులకు బంపర్ ఆఫర్ అందించిన తెలంగాణ సర్కార్

వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ అందించింది. పెండింగ్ చలాన్ల పై మరోసారి భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు తెలంగాణ పోలీసుశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ఏడాది పెండింగ్ చలాన్లపై రాయితీ ఇవ్వగా.. ఫైన్లు కట్టేందుకు వాహనదారులు ఎగబడ్డారు. రాయితీ ఉన్న సమయంలో దాదాపు రూ.300 కోట్ల వరకు పెండింగ్ చలాన్లు వసూలు అయ్యాయి. మరోసారి ఇలాంటి ఆఫర్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఉత్వర్తులు త్వరలోనే వెలువడే అవకాశం కనిపిస్తోంది.

గతంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చేందుకు పోలీసులు ముందుకు వచ్చారు. ఈనెల 26వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లు డిస్కౌంట్‌తో కట్టవచ్చని తెలిపింది. ఆర్టీసీ డ్రైవర్స్, తోపుడు బండ్ల వారికి 90 శాతం డిస్కౌంట్, టూవీలర్ చలాన్లకు 80 శాతం డిస్కౌంట్, ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. లారీలతో పాటు ఇతర హెవీ వెహికిల్స్‌కి 50 శాతం డిస్కౌంట్‌ ఇచ్చారు. ఆన్‌లైన్‌తో పాటు మీసేవ సెంటర్స్‌లో డిస్కౌంట్‌లో చలాన్స్ పేమెంట్ చేసే అవకాశాన్ని పోలీస్ శాఖ కల్పించింది.