తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
![](https://www.vaartha.com/wp-content/uploads/2024/05/Appointment-of-in-charge-VCs-for-10-universities-in-Telangana.jpg)
హైదరాబాద్ః రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నేటితో గత వీసీల పదవీ కాలం ముగిసింది. బీఆర్ఎస్ సర్కార్ 2021 మే 22న పది వర్సిటీలకు వీసీలను నియమించింది.
ఓయూ, కాకతీయ, జేఎన్టీయూ, శాతవాహన, మహాత్మాగాంధీ, తెలంగాణ, పాలమూరు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, జవహర్లాల్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీల వీసీల పదవీ కాలం ఈరోజుతో ముగియడంతో సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జి వీసీలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉస్మానియా యూనివర్సిటీకి దాన కిశోర్, జేఎన్టీయూ బాధ్యతలను బుర్ర వెంకటేశ్కు అప్పగించింది. కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జి వీసీగా వాకాటి కరుణ, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ రిజ్వి, తెలంగాణ వర్సిటీకి సందీప్ సుల్తానియా, తెలుగు యూనివర్సిటీకి వీసిగా శైలజ రామయ్యర్ నియమితులయ్యారు.
అలాగే మహాత్మా గాంధీ వర్సిటీకి నవీన్ మిట్టల్, శాతవాహన వర్సిటీకి సురేంద్ర మోహన్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్కి జయేశ్ రంజన్, పాలమూరు వర్సిటీ ఇన్ఛార్జి వీసీగా నదీం అహ్మద్ను నియమించింది.