రిటైర్డ్ జస్టిస్ వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

జై భీమ్ సినిమా చూశాక పెరిగిన గౌరవం మీ వ్యాఖ్యలతో పోయింది

అమరావతి : హైకోర్టుతో ఏపీ ప్రభుత్వం పోరాడాల్సి వస్తోందంటూ మద్రాసు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులపై అభ్యంతరం ఉంటే ఆ విషయం మేరకే మాట్లాడాలి తప్పితే మొత్తం న్యాయస్థానాన్నే నిందించడం సరికాదని హితవు పలికింది. ఆయన వ్యాఖ్యలు హైకోర్టు ప్రతిష్ఠను దిగజార్చడమే అవుతుందని మండిపడింది. రాష్ట్రంలోని పరిస్థితులపై అవగాహన లేకుండా మాట్లాడారని, ఇది దురదృష్టకరమని జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు. నిజానికి ‘జై భీమ్’ సినిమాలోని న్యాయవాదిగా కథానాయకుడి పాత్ర చూసిన తర్వాత జస్టిస్ చంద్రుపై గౌరవం అమాంతం పెరిగిందని, విజయవాడ వచ్చి హైకోర్టుపై ఆయన చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ఆ గౌరవం కాస్తా పోయిందని అన్నారు.

సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై పోస్టులు పెడుతూ దూషిస్తుంటే సీబీఐతో కేసు పెట్టించి దర్యాప్తు చేయించడం తప్పెలా అవుతుందో చెప్పాలని జస్టిస్ దేవానంద్ ప్రశ్నించారు. నర్సీపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకర్‌ను విశాఖ పోలీసులు దారుణంగా కొట్టి హింసించారని, జస్టిస్ చంద్రు విశాఖ వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడి మానవహక్కుల ఉల్లంఘనపై మంచి డైరెక్టర్‌తో సినిమా తీయించాలని సూచించారు. పాఠశాల ప్రాంగణాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్వహిస్తుంటే వాటిని తొలగించాలని ఆదేశిస్తే ఏడాది వరకు అధికారులు ఆవైపు కూడా చూడలేదన్నారు. దీంతో అధికారుల చర్యలను సుమోటోగా స్వీకరించి చర్యలు ప్రారంభించిన తర్వాత కానీ వాటిని తొలగించలేదని గుర్తు చేశారు. ఇది పేద విద్యార్థుల హక్కులను కాపాడడం కాదా? అని ప్రశ్నించారు.

ఉపాధి బిల్లులు సకాలంలో అందక కూలీలు ఆత్మహత్య చేసుకుంటుంటే అలా చేయొద్దని, న్యాయం జరుగుతుందని కోర్టు విజ్ఞప్తి చేసిన సంగతి గురించి తెలియదా? అన్నారు. పోలీస్ స్టేషనల్లో పౌరులపై జరిగే వేధింపులు ఒక్కటే హక్కుల ఉల్లంఘన కాదని.. సమాజంలో పలు రకాలుగా హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని నియంత్రించడంలో న్యాయస్థానాలది కీలక పాత్ర అని జస్టిస్ దేవానంద్ స్పష్టం చేశారు. కోర్టు తీర్పులపై అభ్యంతరం ఉంటే అప్పీలుకు వెళ్లాలి తప్పితే ఇలా కోర్టులపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని అన్నారు. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై సుమోటోగా క్రిమినల్ కోర్టు ధిక్కరణ కేసు తీసుకోవాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాద్దామనుకున్నానని, అయితే, ఆయన సామాజిక పరిస్థితి, వయసు, న్యాయవాదిగా సమాజానికి చేసిన సేవను దృష్టిలో పెట్టుకుని ఆ ఆలోచనను విరమించుకున్నట్టు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 4 వేలకు పైగా కేసులు పరిష్కరించానని, వీటిలో ఏ ఒక్క దాంట్లో అయినా న్యాయమూర్తిగా చేసిన ప్రమాణానికి విరుద్ధంగా ప్రవర్తించినట్టు రుజువు చేస్తే తక్షణం బాధ్యతల నుంచి తప్పుకుంటానని జస్టిస్ దేవానంద్ అన్నారు. దేశంలోని మిగతా హైకోర్టులతో పోలిస్తే ఏపీ హైకోర్టు అసౌకర్యాల మధ్యే పనిచేస్తోందని ఆయన గుర్తు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/