సిద్ధ‌వ‌టం స‌భ‌లో జ‌గ‌న్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించిన ప‌వ‌న్ క‌ల్యాణ్

జనసేన అధినేత మరోసారి జగన్ సర్కార్ ఫై విమర్శలు గుప్పించారు. కౌలు రైతు భ‌రోసా యాత్ర‌లో భాగంగా శనివారం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించారు. జిల్లాలోని సిద్ధవ‌టం మండ‌ల కేంద్రంలో ఏర్పాటు చేసిన ర‌చ్చ‌బండ‌లో పాల్గొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ 173 మంది కౌలు రైతుల కుటుంబాల‌కు రూ.1 ల‌క్ష చొప్పున రూ.1.73 కోట్ల‌ను పంపిణీ చేశారు. అనంత‌రం అక్క‌డే ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు.

త‌న పోరాటం వ్య‌క్తుల‌పై కాదని… భావాల‌పైనే పోరాటం చేస్తాన‌ని తెలిపారు. 2014లో మార్పు కోసం బ‌య‌ట‌కు వ‌చ్చాన‌న్న ప‌వ‌న్‌… తానేదో 9 నెల‌ల్లోనే అధికారం చేజిక్కించుకుంటాన‌ని పార్టీ పెట్ట‌లేద‌ని తెలిపారు. ఈ కార‌ణంగానే త‌న ప్ర‌యాణం పాతికేళ్ల ప్ర‌స్థానం అని తాను చెప్పాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు కొంత‌వ‌ర‌కైనా అడ్డుక‌ట్ట ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌వ‌న్ అన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్‌, ఆయ‌న సోద‌రి వైఎస్ ష‌ర్మిల‌ల ప్ర‌స్తావ‌న‌ను తీసుకొచ్చారు. అన్న ప‌ట్టించుకోలేద‌ని చెల్లి మ‌రో పార్టీ పెట్టింద‌ని ప‌వ‌న్ ఎద్దేవా చేశారు.

రాయ‌ల‌సీమ చ‌దువుల నేల అన్న ప‌వ‌న్‌… ప‌ద్యం పుట్టిన నేల‌లో ఇప్పుడు మ‌ద్యం ఏరులై పారుతోంద‌ని విమ‌ర్శించారు. ఉపాధి అవ‌కాశాలు లేకుంటే యువత ఏం చేయాల‌ని ప్ర‌శ్నించిన ప‌వ‌న్‌… ఇంటింటికీ చీప్ లిక్క‌ర్ వ‌చ్చింద‌ని యువ‌తే చెబుతున్నార‌ని అన్నారు. ఎవ‌రి కాళ్ల‌పై వారు నిల‌బ‌డేలా ప్ర‌భుత్వం ప్రోత్స‌హించాల‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డంతో కౌలు రైతుల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతోంద‌న్న ప‌వ‌న్‌.. కౌలు రైతుల‌కు క‌నీసం గుర్తింపు కార్డులు కూడా ఇవ్వ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

పేదరికంలో ఉన్న కులాల గురించే తాను ఆలోచిస్తానని చెప్పారు. సీమలోని రెడ్డి, క్షత్రియ కులాల్లో కూడా పేదలు ఉన్నారని తెలిపారు. అగ్ర కులాలు ఘర్షణ పడితే సమాజంలో ఇబ్బందులు వస్తాయని చెప్పారు. అన్ని కులాలకూ సాధికారత రావాలని ఆకాంక్షించారు. సమాజం ఎప్పుడూ ఒకేలా ఉండకూడదని మార్పు రావాలన్నారు. వైస్సార్సీపీ ప్రభుత్వ పనుల వల్ల రెడ్డి కులానికీ నష్టం జరుగుతోందని పేర్కొన్నారు.

అలాగే రేపు తిరుపతి నగరం బాలాజీ డెయిరీ సమీపంలోని జీఆర్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాలులో జనవాణి కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం 4 గంటల వరకూ కార్యక్రమం కొనసాగునుందని తెలిపారు. పవన్‌ కళ్యాణ్‌ అర్ధరాత్రికి తిరుపతికి చేరుకుని తాజ్‌ హోటల్లో బస చేయనున్నారు. ఆదివారం ఉదయం జీఆర్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాలుకు చేరుకుని జనవాణిలో ప్రజల నుంచీ అర్జీలు స్వీకరించనున్నారు.