ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై బ్యాన్‌ ప్రకటించిన సీఎం జగన్‌

రాష్ట్రంలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై బ్యాన్‌ ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి నాణేనికి రెండువైపులని ఈ సందర్భంగా జగన్ అన్నారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు వినియోగించరాదని స్పష్టంచేసిన జగన్ ప్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే బట్టతో చేసినవే ఉండాలని సూచించారు. విశాఖ నుంచి ఈ ప్లాస్టీక్ ఫ్లెక్సీల నిషేదం అమలు కావాలని పిలుపునిచ్చారు.

శుక్రవారం ఉదయం కోస్టల్‌ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ.. ప్లాస్టిక్‌ వ్యర్థాలను క్లీన్‌ చేశారు వలంటీర్లు. ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. ఇవాళ విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమం జరిగిందని సీఎం జగన్‌ చెప్పారు. దాదాపు 76 టన్నుల ప్లాస్టిక్‌ను సముద్రం తీరం నుంచి తొలగించారు. భూమిపై 70 శాతం ఆక్సిజన్‌ సముద్రం నుంచే వస్తోంది. అందుకే సముద్రాన్ని కాపాడుకోవాలి. అలాగే ఏపీ తీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరిదీ అని 2027 నాటికి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ మన సంకల్పంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధించాలని జగన్ పిలుపునిచ్చారు. ఇక పర్యావరణాన్ని రక్షిస్తూనే.. ఆర్థిక పురోగతి సాధించాలన్నారాయన. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగు వేల చెత్త సేకరణ వాహనాలను ఏర్పాటు చేశాం అని సీఎం జగన్‌ తెలిపారు.