ఏపీభవన్ విభజనపై సమావేశం వాయిదా..

ఏపీ భవన్‌ విభజనపై కేంద్ర హోంశాఖ నిర్వహించ తలపెట్టిన సమావేశం మరోసారి వాయిదాపడింది. షెడ్యూల్‌ ప్రకారం ఈరోజు(సోమవారం) సమావేశం జరగాల్సి ఉండగా.. బుధవారానికి వాయిదా వేసింది. కేంద్ర హోం శాఖ కార్యాలయం నార్త్ బ్లాక్‌లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఆర్థిక శాఖ కార్యదర్శులు హాజరుకానున్నట్లు సమాచారం.

ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్ రావత్ , తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె రామకృష్ణ రావు హజరవుతున్నట్లు తెలుస్తోంది. విభజన చట్టం ప్రకారం ఢిల్లీలోని ఏపీ భవన్ 10 ఏళ్ళలో విభజన కావాల్సి ఉంది. ప్రస్తుతం 48శాతం తెలంగాణ, 52 శాతం ఏపీ వాటాగా ఆస్తులు పంచుకుని రెండు తెలుగు రాష్ట్రాలు ఢిల్లీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ఆస్తులు పంచుకోవాలని రెండు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించిన విషయం తెలిసిందే.