మణిపూర్ లో మరో దారుణం : కుకీ తెగకు చెందిన ఓ వ్యక్తి తలను నరికిన దుండగులు

మణిపూర్ దారుణాలు ఆగడం లేదు. తాజాగా కుకీ తెగకు చెందిన ఓ వ్యక్తి తలను దుండగులు నరికారు. బిష్ణుపూర్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత రెండు నెలలుగా మణిపూర్ లో హింసాత్మక ఘటనలు, లూటీలు, దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులతో అక్కడి ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు. ఇప్పటి వరకూ 140 మందికిపై ప్రాణాలు కోల్పోయారు. రీసెంట్ గా ఇద్దరు కుకీ మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడడం దేశ వ్యాప్తంగా చర్చ గా మారింది. ఈ ఘటన ఫై ప్రతిపక్ష పార్టీలు , యావత్ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మణిపూర్ లో హింసను కట్టడి చేయడానికి అక్కడి బిజెపి ప్రభుత్వ చేపట్టిన చర్యలు అంతగా ఫలించడం లేదు. మైతీలను ఎస్జీ జాబితాలో చేర్చడానికి అక్కడ బీజేపీ ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తుండటమే ఈ దాడులకు ప్రధాన కారణంగా తెలుస్తుంది.

ఇదిలా ఉండగా..వ్యక్తిని తలను వేలాడదీసిన ఘటన బిష్ణుపూర్‌ జిల్లాలో జరిగినట్లు తెలుస్తోంది. జులై 4 వ తేదీ అర్ధరాత్రి కుకీ, మెయితీ వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇందులో కుకీ తెగకు చెందిన నలుగురు వ్యక్తులను మెయితీ వర్గానికి చెందిన వారు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇందులో డేవిడ్ థీక్‌ అనే వ్యక్తి తలను నరికి.. మొండెం నుంచి వేరు చేశారు. అంతటితో ఆగకుండా అనంతరం అక్కడ వెదురు కర్రలతో చేసిన కంచెకు డేవిడ్ థీక్ తలను వేలాడదీశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారడంతో అసలు విషయం బయటికి వచ్చింది.

మణిపూర్‌లో మే 3 వ తేదీ నుంచి ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. దీంతో అప్పటి నుంచి జరిగిన ఘటనలను స్థానికులు రికార్డ్ చేశారు. అయితే ఇటీవల ఇంటర్నెట్ సర్వీసులు పునరుద్ధరించడంతో మే 3 వ తేదీ నుంచి జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియోలను స్థానికులు సోషల్ మీడియాలో ఉంచడంతో అవి వైరల్‌గా మారుతున్నాయి.