ఏపీలో ప్రాంతీయ పార్టీలను బిజెపి ఆక్రమించింది
రాష్ట్ర హక్కుల కోసం వైఎస్సార్సిపి ఎంపీలు పార్లమెంట్ను స్తంభింపజేయాలి
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలను బిజెపి ఆక్రమించిందని పీసీసీ చీఫ్ శైలజానాథ్ అన్నారు. బిజెపి తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటకాగుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర హక్కుల కోసం వైఎస్సార్సిపి ఎంపీలు పార్లమెంట్ను స్తంభింపజేయాలన్నారు. ప్రజలను ఎంతో కాలం మోసం చేయలేరని చెప్పారు. వైఎస్సార్సిపి ప్రభుత్వం దగ్గర సరైన ప్రణాళిక లేదన్నారు. సీఎం జగన్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే ప్రధానమంత్రి మోడీనే ఎక్కువగా కనిపిస్తున్నారని విమర్శించారు. ఆరోగ్యశ్రీ పథకంలో వైఎస్ ఫొటో కనుమరుగు చేస్తున్నారన్నారు. వైఎస్ ఆశయాలపై
జగన్మోహన్ రెడ్డికి గౌరవం లేదన్నారు. రాజశేఖర్రెడ్డి మంచి ఆశయంతో శాసనమండలి పెట్టారని గుర్తుచేశారు. జగన్ సీఎం అయిన తర్వాత ధరలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. రాజధానిగా అమరావతిని జగన్మోహన్ రెడ్డి మూడు సార్లు స్వాగతించారని గుర్తుచేశారు. ప్రమాణస్వీకారం చేసిన రోజు జగన్ కనీసం రాజధాని మార్పు ప్రస్తావన చేయలేదన్నారు. అందరికీ అనువైన ప్రాంతం రాజధానిగా ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటుందని తెలిపారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/