19 నుంచి ఏపీలో వర్షాలు..వాతావరణ శాఖ

రేపటి నుంచి రాష్ట్రంలో విస్తరించనున్న రుతుపవనాలు

Heavy-Rain
Heavy-Rain

అమరావతిః ఏపిలో ఎండల తీవ్రత మరో రెండు రోజులేనని, ఆ తర్వాత రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా రాష్ట్రంలో ఎండల తీవ్రత మాత్రం తగ్గలేదని, దీనికి కారణం రుతుపవనాలు విస్తరించకపోవడమేనని తెలిపింది. తాజాగా ఈ నెల 18 నుంచి 21 వరకు రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరిస్తాయని, దీంతో వర్షాలు కురుస్తాయని వివరించింది. ఈ నెల 19 నుంచి తిరుపతి, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే ఇంకొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

కోస్తాంద్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించారు. శని, ఆది వారాల్లో (నేడు, రేపు) రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 42-44 డిగ్రీలు నమోదవుతాయని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.