రెండోసారి కరోనా బారినపడిన బిగ్ బి అమితాబ్
కరోనా మహమ్మారి ఇంకా మనుషులను వదిలిపెట్టడం లేదు. వాక్సిన్ లు వేసుకున్నప్పటికీ కొంతమంది కరోనా బారినపడుతున్నారు. ముఖ్యమంగా సినీ , రాజకీయ నేతలు రెండోసారి కరోనా బారినపడడం అభిమానులను, కార్యకర్తలను టెన్షన్ కు గురి చేస్తుంది. తాజాగా బాలీవుడ్ లెజెండ్ యాక్టర్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ రెండోసారి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే తెలిపారు. కరోనా పాజిటివ్ తేలడం తో హాస్పటల్ లో జాయిన్ చేసారు.
ఇటీవల తనను కలిసినవారు కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. గత కొన్నిరోజులుగా తనతోపాటు ఉన్నవారంతా పరీక్ష చేయించుకోండి’ అని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అమితాబ్ ప్రస్తుతం సోనీటీవీ రూపొందిస్తున్న కౌన్బనేగా కరోడ్పతి 14వ సీజన్ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తున్నది. కాగా, బిగ్ బీ (Big B) మరోసారి కరోనా బారినపడటంతో ఆయన అభిమానులతోపాటు బాలీవుడ్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆయన తొందరగా కోలుకోవాలని వేడుకుంటున్నారు.
ఇక భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం కరోనా బారిన పడ్డారు. దీంతో జట్టుతో పాటు ఆసియా కప్ టి20 టోర్నీ కోసం ద్రవిడ్ దుబాయ్ విమానం ఎక్కలేదు. ‘అక్కడికి బయల్దేరే ముందు రొటీన్గా చేసే కోవిడ్ పరీక్షల్లో ద్రవిడ్కు పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఆయనకు అతి స్వల్ప లక్షణాలే ఉన్నాయి. దీంతో ఆయన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వైద్య బృందం పర్యవేక్షణలో ఉంచారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ పరీక్ష చేసి నెగెటివ్ రిపోర్టు రాగానే ద్రవిడ్ యూఏఈకి పయనమవుతారు’ అని బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించారు.