అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు తనకు ఆహ్వానం రాలేదు – గవర్నర్ తమిళి సై

శుక్రవారం హైదరాబాద్ నడిబొడ్డున.. హుస్సేన్ సాగర్ తీరాన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ప్ర‌కాశ్ అంబేద్క‌ర్‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని , ఆహ్వానం అందింతే తప్పకుండా వెళ్లేదాన్ని అన్నారు గవర్నర్ తమిళి సై. అంబేద్కర్ ఎక్కువగా మహిళల గురించి, మహిళల హక్కుల గురించి మాట్లాడారన్న ఆమె.. కానీ ఒక మహిళా గవర్నర్ కి ఆహ్వానం రాకపోవడం ఆశ్చర్యమని.. అందుకే రాజ్ భవన్ లోనే అంబేద్కర్ కు నివాళులు అర్పించానని తమిళ్ సై అన్నారు.

శనివారం తార్నాక లోని నేషనల్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ , విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో జాతీయ పాలక మండలి సభ్యులు, విజ్ఞాన భారతి, కేఎస్ శాస్త్రి రచించిన స్వతంత్ర సమరంలో విజ్ఞాన శాస్త్రం అనే పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తో పాటు ICMR-NIN డైరెక్టర్ హేమలత హాజరయ్యారు. బ్రిటిష్ పరిపాలన కారణంగా దాగి ఉన్న చరిత్ర ఇప్పుడు ఓ పుస్తకం రూపంగా బయటికి రావడం సంతోషంగా ఉందని గవర్నర్ తమిళి సై అన్నారు. ఇలాంటి పుస్తకాలు యంగ్ పీపుల్ కి తెలియాలన్న ఆమె.. ఆదివాసుల ఆరోగ్యం కోసం ఐసీఎంఆర్ తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని చెప్పారు.