కరోనాపై పోరాటానికి ఆర్ధిక సహాయం
అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా రూ.103 కోట్ల విరాళం
బీజింగ్: చైనాలో కరోనావైరస్ మరణ మృందంగం మోగిస్తోంది. మందులేని ఈ మహమ్మారి చైనీయులను కబలిస్తోంది. రోజురోజుకూ విస్తరిస్తూ ప్రపంచదేశాలను గజగజా వణికిస్తోంది. ప్రాణాంతక కరోనావైరస్ని ఎదుర్కొనేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు బాధితులకు కట్టుదిట్టమైన భద్రత మధ్య చికిత్స అందిస్తూనే.. మరోవైపు కరోనా వైరస్కు మందు కనిపెట్టేందుకు ల్యాబ్లో ప్రయోగాలు చేస్తున్నారు. ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలు సైతం తమ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో చైనా ప్రభుత్వానికి ప్రముఖ వ్యాపారదిగ్గజం, అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా రూ.14.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.103 కోట్లు) విరాళంగా ఇచ్చారు. కరోనా వైరస్కు పోరాటానికి తన వంతు సాయంగా ఈ విరాళం అందజేశారు. ఇక టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ అధినేత ‘పోని మా’ సైతం 300 మిలియన్ యువాన్లు (రూ.309 కోట్లు) విలువైన వస్తువులతో పాటు మ్యాపింగ్, డేటా సర్వీసులను అందిస్తున్నారు. దీదీ చుక్సింగ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ తమ వాహనాల ద్వారా ఉచిత రవాణా సాయం చేస్తోంది. ఇక డైడు, టిక్ టాక్ మాతృసంస్థ బైట్డాన్స్ వంటి కంపెనీలు సైతం తమకు తోచిన సాయం అందిస్తున్నాయి. కాగా, చైనాలో కరోనావైరస్ ప్రభావంతో 170 మందికి పైగా చనిపోయారు. వేలాది మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/