ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో అందుకే దొంగతనం చేసినట్లు నిజం ఒప్పుకున్న పనిమనిషి

పది రోజుల క్రితం ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. చెన్నైలోని తన ఇంట్లో నుంచి 48 తులాల బంగారం, వజ్రాభరణాల జ్యుయలరీ చోరీకి గురైనట్టు తెయాన్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఐశ్వర్య . కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. విచారణలో ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో పని చేస్తున్న ఈశ్వరిని నిందితురాలిగా గుర్తించారు. ఆమెను అరెస్ట్ చేసిన విచారించగా తానే దొంగతనం చేశానని ఒప్పుకుంది.

ఈశ్వరిని విచారించిన అనంతరం ఆమె ఇంట్లో 100 సవర్ల నగలు, 4 కిలోల వెండి, 30 గ్రాముల వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈశ్వరి ఇంట్లో ఐశ్వర్య చెప్పిన దానికంటే ఎక్కువ నగలు ఉండడంతో పోలీసుల;యూ షాక్ అయ్యారు. దీనిపై ఐశ్వర్యను కూడా పోలీసులు ప్రశ్నించారు. ఐశ్వర్య ఇంట్లోనే కాకుండా రజనీకాంత్, ధనుష్ ఇంట్లో కూడా ఈశ్వరి పని చేస్తున్నట్టు తేల్చారు. అవన్నీ కూడా రజనీకాంత్, ధనుష్ ఇంట్లో దొంగతనం చేసినవే అని పోలీసులు తేల్చారు.

ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న ఈశ్వరి అసలు దొంగతనం ఎందుకు చేసిందో పోలీసులకు వెల్లడించింది. తాను ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో గొడ్డులా పనిచేశానని, ఆమె చెప్పిన పనులన్నీ చేసేదానినని పోలీసులకు తెలిపిన ఈశ్వరి.. ఐశ్వర్య వద్ద బోలెడు డబ్బున్నా తనకు మాత్రం రూ.30 వేలు జీతం ఇచ్చేవారని చెప్పింది. ‘ఆ డబ్బు సరిపోక పోవడంతో దొంగతనాలు చేయడం మొదలుపెట్టినట్లు తెలిపింది. మొదట చిన్న చిన్న వస్తువులను దొంగిలించడం మొదలుపెట్టాను. కానీ నేను దొరికిపోలేదు. దీంతో ధైర్యం చేసి నగలు కూడా దోచుకున్నాను’ అని విచారణలో తెలిపింది. ఒకవేళ తాను దొరకకపోయి ఉంటే ఇంకా దొంగతనం చేసేదానినని.. ఇప్పటికే తాను రెండంతస్తుల ఇల్లు కూడా కొన్నానని పోలీసులకు ఈశ్వరి చెప్పడం కొసమెరుపు.