ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సంస్థకు చెందిన సీనియర్ సిబ్బంది సామూహికంగా సిక్ లీవ్ తీసుకున్నారు. దీంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు సుమారు 70 విమానాలను రద్దు చేశారు. దీంట్లో అంతర్జాతీయ, దేశీయ విమానాలు కూడా ఉన్నాయి. క్యాబిన్ సిబ్బందికి చెందిన కొంత మంది ఉద్యోగులు చివరి నిమిషంలో సిక్ లీవ్ తీసుకున్నారని, గత రాత్రి నుంచి విమానాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఎందుకు ఉద్యోగులు ఒకేసారి సిక్ లీవ్లో వెళ్లారో తెలియడం లేదని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రతినిధి వెల్లడించారు. విమానల రద్దు వల్ల ఇబ్బందులు పడ్డవారికి రిఫండ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. లేదంటే జర్నీ రీషెడ్యూల్ చేయడం జరుగుతుందని ప్రతినిధి తెలిపారు.