బిజెపిలో చేరితో ఒక్క రోజులో మంత్రిని చేస్తామన్నారుః నటి రమ్య

బిజెపి ఇంకా ఆ స్థాయికి దిగజారలేదు..తీవ్రంగా స్పందించిన మంత్రి

actress-ramya-sensational-comments-on-bjp

న్యూఢిల్లీః కన్నడ నటి, కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రమ్య బిజెపిపై కీలక వ్యాఖ్యలు చేశారు. బిజెపిలో చేరితే ఒక్క రోజులోనే మంత్రి పదవి ఇస్తానని ఓ నాయకుడు ఆఫర్ ఇచ్చారని వ్యాఖ్యానించి కలకలం రేపారు. అయితే, తాను ఆ ఆఫర్‌ను అప్పుడే తిరస్కరించినట్టు చెప్పారు. మాండ్యా మాజీ ఎంపీ అయిన రమ్య 2019లో కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ ఇన్‌చార్జ్ పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆమె కూడా ఉన్నారు.

తాజాగా, రమ్య మాట్లాడుతూ.. తనకు బిజెపిపై వ్యతిరేకత లేదని అయితే, కొందరు నాయకులు, వారి సిద్ధాంతాలు మాత్రం తనకు గిట్టవని అన్నారు. సినిమా నటులను ఎన్నికల ప్రచారానికి తీసుకెళ్తే నగదు పంచకుండానే ప్రజలు వచ్చేస్తారని కొందరు నేతలు అనుకుంటారని అన్నారు. నిజానికి సినిమా నటులు, ప్రజాదరణ ఉన్న వ్యక్తులు ప్రచారానికి వచ్చినంత మాత్రాన ఓట్లు రావని రమ్య స్పష్టం చేశారు.

ప్రముఖ నటుడు సుదీప్ బిజెపికి ప్రచారం చేస్తుండడంపై రమ్య మాట్లాడుతూ.. బొమ్మైతో ఆయనకున్న వ్యక్తిగత అభిమానంతోనే ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు. ప్రచారానికి రావాలంటూ ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా తాను నిరాకరించానని పేర్కొన్నారు.

మరోవైపు బిజెపిలోకి వస్తే ఒక్క రోజులోనే మంత్రిని చేస్తానని బిజెపి ఆఫర్ ఇచ్చిందన్న నటి రమ్య వ్యాఖ్యలపై మంత్రి అశోక్ తీవ్రంగా స్పందించారు. ఆమెను పార్టీలోకి ఆహ్వానించేంత స్థాయికి బిజెపి దిగజారలేదన్నారు. ఆమె అవసరం బిజెపికి లేనేలేదన్నారు. బిజెపిలోకి ఆమెను ఆహ్వానించిన నాయకుడు ఎవరో తెలియదని అశోక్ పేర్కొన్నారు.