ద్రౌపది ముర్ముకి అభినందనలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

భారత 15 వ రాష్ట్రపతి గా ద్రౌపదీ ముర్ము ఎన్నికయ్యారు. ప్రత్యర్థి యశ్వంత్​ సిన్హాపై భారీ మెజార్టీతో విజయం సాధించి , భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా బిజెపి శ్రేణులు , ద్రౌపదీ ముర్ము కు మద్దతు పలికిన నేతలు , ఆదివాసులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ద్వారా ద్రౌపదీ ముర్ము కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా ద్రౌపది ముర్ముకి అభినందనలు తెలియజేసారు.

” భారత దేశానికి నిజమైన చారిత్రాత్మక క్షణం! మొదటి గిరిజన మహిళ అధ్యక్షురాలి ఎన్నిక! హృదయపూర్వక అభినందనలు మేడం ద్రౌపది ముర్ము జీ! మన గొప్ప దేశానికి రాష్ట్రపతి పదవికి మీ ప్రయాణం ప్రతి భారతీయుడికి, మరియు 110 మిలియన్ల గిరిజన జనాభాకు ఎంతో స్ఫూర్తిదాయకం” అంటూ ట్వీట్ చేశారు.

ఇక నిన్న ప్రధాని మోడీ ద్రౌపదీ ముర్ము ఇంటికి వెళ్లి అభినందనలు తెలుపగా , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముర్ముకు అభినంద‌న‌లు తెలిపి ఆమెకు మిఠాయి తినిపించారు. ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం ముర్ము నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం ఈ నెల 24తో ముగుస్తుంది. నూతన రాష్ట్రపతి గా ద్రౌపదీ 25న ప్రమాణస్వీకారం చేయనున్నారు.