గుంటూరులో దారుణం : అందరు చూస్తుండగానే హత్య

గుంటూరు లోని పట్నంబజార్ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయానికి సమీపంలోని బాబు హోటల్ వద్ద దారుణం చోటుచేసుకుంది. జనాలంతా చూస్తుండగానే ఓ వ్యక్తిని కొంతమంది దుండగులు అతి దారుణంగా హత్య చేసారు.నల్లచెరువు ఆరో లైన్‌కు చెందిన 38 ఏళ్ల దొడ్డి రమేశ్‌.. వ్యాపారంతోపాటు శుభకార్యాలకు డెకరేషన్ పనులు చేస్తుంటాడు.

మంగళవారం రాత్రి పట్నంబజార్ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయానికి సమీపంలోని బాబు హోటల్ వద్ద
కొందరు దుండగులు నడి రోడ్డుపై రమేష్ ను వెంటాడి కత్తులు, వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. కళ్లముందే జరిగిన దారుణం చూసి జనం భయభ్రాంతులకు గురయ్యారు. తనను వెంటాడుతున్న దుండగుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి రమేష్ ఓ కిరాణాషాపులోకి వెళ్లి దాక్కోగా, బయటకు ఈడ్చుకు వచ్చి మరీ దారుణంగా హత్య చేశారు.

హత్యకు ముందు రమేశ్ ఇంట్లోనే ఉన్నాడని, స్నానానికి వెళ్లేందుకు రెడీ అవగా ఫోన్ రావడంతో బయటకు వెళ్లాడని రమేశ్ తల్లి తెలిపారు. రమేశ్‌ ఓ హత్యకేసులో నిందితుడని, అతడిపై రౌడీషీట్ కూడా ఉందని పోలీసులు తెలిపారు. కాగా, తన భర్తను బుడంపాడుకు చెందిన రౌడీ షీటర్ ఆర్కే హత్య చేశాడని రమేశ్ భార్య లత ఆరోపించారు.