షూటింగ్ లో ఘోర ప్రమాదం – ముగ్గురి మృతి

Major Accident in Bharateeyudu2 shooting

chennai: కమల్ హాసన్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు-2  చిత్ర షూటింగ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. షూటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ క్రేన్ విరిగిపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. డైరెక్టర్ శంకర్  గాయాలు కాకుండా తప్పించుకున్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నై సమీపంలోని పూనమల్లి   దగ్గర జరుగుతోంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కమల్ హాసన్  సెట్స్ లోనే ఉన్నారు. ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. సహాయక చర్యల్లో కమల్ హాసన్ కూడా పాల్గొన్నారు. బుధవారం రాత్రి ఈవీపీ ఫిల్మ్ సిటీలో ఈ ఘటన జరిగింది. ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులుగా ఇక్కడే జరుగుతోంది.

షూటింగ్ లో భాగంగా భారీ క్రేన్ ఏర్పాటు చేశారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ భారీ క్రెయిన్ పడిపోయింది. పక్కనే కెమెరా డిపార్ట్‌మెంట్ దగ్గర శంకర్ ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఘటనా స్థలంలో కమల్ హాసన్ సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొన్నారు. తన సినిమా షూటింగ్‌లో ఈ ఘటన జరగడం పట్ల కమల్ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు.

ఆయన పేరు కృష్ణ(34). మరో వ్యక్తి ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్ (60). శంకర్ పర్సనల్ అసిస్టెంట్ 28 ఏళ్ల మధు కూడా చనిపోయారు.  పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఫోన్ చేసి ఘటనపై తెలుసుకున్నట్లు సమాచారం. ఊహించని ఈ ఘోర ప్రమాదం భారతీయ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది.

ముగ్గురు మిత్రులను కోల్పొయా… కమల్ హాసన్

సెట్స్‌లో జరిగిన ప్రమాదంపై.. హీరో కమల్‌హాసన్‌ ట్విటర్‌లో స్పందించారు. ఈ ప్రమాదం అత్యంత భయానకమైనదన్నారు. ఈ ఘటన తనని కలిచివేసిందన్నారు. ముగ్గురు స్నేహితులను కోల్పోవడం బాధాకరమన్నారు. తన బాధ కన్నా.. వారిని కోల్పోయిన కుటుంబాల బాధ ఎన్నో రెట్లు ఎక్కువ అంటూ ట్వీట్ లో తన ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో ఒకరిగా వారి కష్టాల్లో పాల్గొంటానని చెప్పారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు కమల్. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
డైరెక్టర్ శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతీయుడు-2ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ తోపాటు సిద్దార్థ, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం పలు భాషల్లో విడుదల చేయనున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/