‘భారత్లో కొత్త పుతిన్ తయారవుతున్నాడు’: ప్రధాని మోడీపై శరద్ పవార్
న్యూఢిల్లీః భారత్లో మరో పుతిన్ తయారవుతున్నాడని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పుతిన్ ను మోడీ అనుకరిస్తున్నారని అన్నారు. గత ప్రధానులు నవ భారత్ ను తయారు చేయాడానికి కృషి చేశారని… మోడీ మాత్రం గత పదేళ్లలో ఆయన ప్రభుత్వం దేశానికి ఏం చేసిందో చెప్పకుండా, విపక్ష నేతలపై నిందలు వేయడం, విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. మహారాష్ట్రలోని అమరావతి నుంచి పోటీ చేస్తున్న మహా కూటమి నేత వికాస్ (కాంగ్రెస్) తరపున నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజ్యాంగాన్ని మారుస్తామని కొందరు బీజేపీ నేతలు బహిరంగంగానే చెపుతున్నారని శరద్ పవార్ మండిపడ్డారు. దేశంలో నిరంకుశత్వం రాకుండా ప్రజలు అడ్డుకోవాలని, ఓటు ద్వారా వారికి గుణపాఠం చెప్పాలని అన్నారు. పుతిన్ ను అనుకరిస్తూ అందరిలో భయాందోళనలను సృష్టించేందుకు మోడీ యత్నిస్తున్నారని చెప్పారు. మన దేశంలో తయారవుతున్న పుతిన్ (మోడీ)ని చూసి ఆందోళనకు గురవుతున్నానని అన్నారు.
అమరావతి ప్రజలకు క్షమాపణ చెప్పేందుకే తాను ఇక్కడకు వచ్చానని పవార్ తెలిపారు. 2019 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి, గెపుపొందిన నవనీత్ కౌర్ (సినీ నటి)కు తాను మద్దతుగా నిలిచానని… ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఇప్పుడు ఇక్కడకు వచ్చానని చెప్పారు. మరోవైపు నవనీత్ కౌర్ ఇటీవలే బీజేపీలో చేరారు. అమరావతి నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు.