గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘోర ప్రమాదం

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఫ్లైఓవర్ పై కారు ప్రమాదం జరుగగా..ఆ ప్రమాదం వద్ద ఆగి ఉన్న ప్రజలపై మరో కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదం లో ఒకరి, ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిది మంది చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇస్కాన్ బ్రిడ్జిపై ఈ ఘోరం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్కాన్ బ్రిడ్జిపై బుధవారం అర్ధరాత్రి ప్రాంతంలో ఓ యాక్సిడెంట్ జరిగింది. ముందు వెళుతున్న డంపర్ ను థార్ జీపు వెనక నుంచి ఢీ కొట్టింది. దీంతో మిగతా వాహనదారులు అక్కడ గుమికూడారు. ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్ కు సాయం చేస్తుండగా ఓ జగ్వార్ కారు వేగంగా దూసుకొచ్చింది. దాదాపు 160 కి.మీ. వేగంతో దూసుకువచ్చి జనాలను ఢీ కొ్ట్టింది. దీంతో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఎమర్జెన్సీ టీం వేగంగా స్పందించి బాధితులను సోలా సివిల్ హాస్పిటల్ కు తరలించింది.

అప్పటికే అందులో తొమ్మిది మంది చనిపోయారని డాక్టర్స్ తెలిపారు. మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పాటిల్ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 అందజేస్తామని, వారికి మెరుగైన వైద్య సాయం అందించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.