ఏడో రోజు పలమనేరులో కొనసాగుతున్నలోకేశ్‌ యువగళం పాదయాత్ర

ఎంఎస్ఎంఈ వర్కర్లతో భేటీ అయిన లోకేశ్

nara-lokesh-yuva galam-yatra-day-7-schedule

పలమనేరుః టిడిపి పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం యాత్ర ఏడో రోజు పలమనేరుకు చేరుకుంది. గురువారం పలమనేరులోని రామాపురం ఎమ్మోస్ ఆసుపత్రి ఎదుట విడిది కేంద్రం నుంచి ఉదయం 9 గంటలకు యాత్ర ప్రారంభమైంది. నేతలు, కార్యకర్తలతో కలిసి జనాలను పలకరిస్తూ నారా లోకేశ్ ముందుకు సాగుతున్నారు. ఉదయం 10:10 గంటలకు పలమనేరులోని చరణ్ దాబా వద్ద ఎంఎస్ఎంఈ వర్కర్లతో లోకేశ్ సమావేశమయ్యారు. వారి సాధకబాదకాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం 10:25 గంటలకు టీడీపీ స్థానిక నేతలు, పార్టీ పెద్దలను కలిసి, లోకేశ్ వారి ఆశీర్వచనాలు అందుకున్నారు. 11 గంటలకు కోర్టుకాంప్లెక్స్ వద్ద లాయర్లతో లోకేశ్ సమావేశం కానున్నారు. 11:40 గంటలకు పలమనేరు సిల్క్ మార్కెట్ లో రైతులు, రైతు కూలీలతో భేటీ, 12:25 గంటలకు టవర్ క్లాక్ వద్ద బహిరంగసభలో లోకేశ్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1:40 గంటలకు టమాటా రైతులు, టెర్రకోట బొమ్మల తయారీదారులతో లోకేశ్ భేటీ అవుతారు.

సాయంత్రం 5:10 గంటలకు జగమర్లలో ఎస్టీ సామాజిక వర్గీయులతో లోకేశ్ ముఖాముఖి కార్యక్రమం ఉంటుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. రాత్రి 8:50 గంటలకు మొగిలి దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన విడిది కేంద్రంలో బసకు లోకేశ్ చేరుకుంటారు. కాగా, గురువారం యాత్ర ప్రారంభించడానికి ముందు ఉదయం రామాపురం ఎమ్మోస్ హాస్పిటల్ క్యాంప్ సైట్ లో లోకేశ్ కాసేపు అభిమానులతో ముచ్చటించారు. తనను కలవడానికి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులతో సెల్ఫీలు దిగారు. యాత్రలో భాగంగా నారా లోకేశ్ ఇప్పటి వరకు 72.3 కిలోమీటర్లు నడిచారు.