అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం: లిఫ్ట్ కూలి 8 మంది కూలీలు మృతి
గుజరాత్ అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ కూలి 8 మంది కూలీలు మృతి చెందారు. ఈ ఘటన గుజరాత్ యూనివర్సిటీకి సమీపంలో చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆస్పైర్-2 భవనంలో ఈరోజు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
“కూలీలతో వెళ్తున్న లిఫ్ట్.. 7వ అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్కు ఒక్కసారిగా పడిపోవడంతో అందులో ఉన్న 8 మంది మరణించినట్లు తెలుస్తుంది. మృతులంతా ఘోఘంబ ప్రాంతానికి చెందిన రోజువారీ కూలీలు” అని అహ్మదాబాద్ జోన్ 1 డిప్యూటీ కమిషనర్ లవీనా సిన్హా తెలిపారు. అయితే ఈ ఘటనపై తమకు భవన యజమానులెవరూ సమాచారం అందించలేదని, మీడియా ద్వారా తెలిసిందని అగ్నిమాపక దళం ఇన్ఛార్జి జయేశ్ ఖాడియా తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నామని, కూలీల మృతదేహాలను స్థానిక వీఎస్ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. రక్షణపరమైన లోపం వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.