ట్రైన్లో పురుడు పోసిన మెడిక‌ల్ స్టూడెంట్‌ కు కేటీఆర్ అభినంద‌న‌లు

ట్రైన్లో పురుడు పోసి తల్లి , బిడ్డను కాపాడిన మెడిక‌ల్ స్టూడెంట్‌ కు కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి విశాఖ ప‌ట్నం వెళ్తున్న శ్రీకాకుళానికి చెందిన గ‌ర్భిణికి సత్యవతి (28) అన‌కాప‌ల్లి స‌మీపంలోకి రాగానే పురుటి నొప్పులొ‌చ్చాయి. కాసేపటి తర్వాత నొప్పులు మరింత పెర‌గ‌డంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

అదే ట్రైన్ లో గీతం మెడికల్ కాలేజీకి చెందిన హౌస్ సర్జన్ స్వాతి ప్రయాణిస్తున్నారు. సత్యవతికి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో విషయం తెలుసుకున్న స్వాతి మరో మహిళతో కలిసి సుఖప్రసవం చేశారు. అన‌కాప‌ల్లి రైల్వే స్టేష‌న్ లో అప్ప‌టికే సిద్ధంగా ఉన్న 108 వాహ‌నంలో అన‌కాప‌ల్లి ఎన్టీఆర్ హాస్పిట‌ల్ కి త‌ర‌లించారు. త‌ల్లిబిడ్డ ఇద్ద‌రు క్షేమంగా ఉన్నారు. పురుడు పోసి తల్లీబిడ్డలను కాపాడిన స్వాతిరెడ్డికి సత్యవతి దంపతులు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఎలాంటి ప‌రిక‌రాలు లేకుండానే అర్ధ‌రాత్రి వేళ గ‌ర్భిణికి పురుడు పోసి త‌ల్లీ బిడ్డ‌ల‌ను కాపాడిన వైద్య విద్యార్ధిని స్వాతి రెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు.