ఘర్షణలో 76 మంది సైనికులకు గాయాలు..ఆర్మీ

ఎవరూ చైనా కస్టడీలో లేరన్న సైన్యాధికారి

76 soldiers hospitalized after India China clash

న్యూఢిల్లీ: భారత్‌, చైనా సరిహద్దుల్లో గల్వాన్‌ లోయలో సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో భారత్‌ సైనికులు 76 మంది గాయపడినట్లు తెలుస్తుంది. వారంతా ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో కోలుకుంటున్నారని సైనిక వర్గాలు వెల్లడించాయి. గాయపడిన వారిలో 18 మంది లేహ్ లో చికిత్స పొందుతున్నారని, వారంతా 15 రోజుల్లో తమ విధుల్లో చేరగలరని, మిగతా 56 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, వీరు మరో వారంలో కోలుకుని విధుల్లో చేరుతారని అధికారులు వెల్లడించారు.

సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. భారత భూ భాగంలో చైనా సైనికులు వేసిన టెంట్ ను తొలగించే ప్రక్రియలో కల్నల్ బీకే సంతోష్ బాబు నేతృత్వంలోని టీమ్, వారితో తలబడిన సంగతి తెలిసిందే. పెట్రోల్ పాయింట్14 సమీపంలో జరిగిన ఈ ఘటనలో భారత జవాన్లపై ఇనుప రాడ్లు, పదునైన ఆయుధాలు, రాళ్లతో దాడి చేసిన చైనా సైనికులు, భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. ఇదే సమయంలో భారత జవాన్లు తీవ్రంగా స్పందించగా, సుమారు 45 మంది చైనా సైనికులు హతమైనట్టు తెలుస్తున్నా, చైనా ఇంకా అధికారిక ప్రకటన మాత్రం విడుదల చేయలేదు. చైనా పీపుల్స్ ఆర్మీ దాడి తరువాత కొందరు భారత సైనికులు అదృశ్యమయ్యారని, వారంతా చైనా కస్టడీలో ఉన్నారని వార్తలు రాగా, ఆర్మీ అధికారులు అటువంటిదేమీ లేదని, ఈ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వారిలో భారత జవాన్లలో ఎవరూ కనిపించకుండా పోలేదని స్పష్టం చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/