హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ స్పందన
సాయంత్రం నుండి తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ పేరు మీడియాలో మారుమోగిపోతుంది. కరోనా నేపథ్యంలో మీడియా ముందుకు వస్తూ ప్రజలకు జాగ్రత్తలు చెపుతూ సుపరిచితమైన శ్రీనివాస్..తాజాగా క్షుద్ర పూజల్లో పాల్గొన్నారని వార్త యావత్ తెలుగు ప్రజానీకాన్ని షాక్ కు గురిచేసింది. గత కొంత కాలంగా కొత్తగూడెం, ఖమ్మం పరిధిలో పర్యటిస్తున్న శ్రీనివాస్.. దేవుడు కరుణిస్తాడని చెబుతూ విచిత్ర పూజలు చేయిస్తున్నారని , ఖమ్మంలో తనను తాను దేవతగా ప్రకటించుకున్న టీఆర్ఎస్ ఎంపీపీ చుట్టూ ఆయన ప్రదక్షిణలు చేస్తూ కెమెరాకు చిక్కడం మీడియాలో వైరల్ గా మారింది.
దీంతో శ్రీనివాస్ దీనిపై స్పందించారు. “మా నాన్న పేరిట చారిటబుల్ ట్రస్ట్ పెట్టాం. సేవలో భాగంగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఎంపీపీలు పూజలు చేస్తున్నామని పిలిచారు. హాలీడేలో భాగంగా కొత్తగూడెం వెళ్లాను. బంజారా గిరిజన దేవత పూజకు మాత్రమే హాజరయ్యా. నేను హోమానికే దండం పెట్టాను. వ్యక్తికి దండం పెట్టలేదు. హోమంలో పాల్గొని బొట్టు మాత్రమే పెట్టుకున్నా. అంతే. అంతకుమించి ఏమీ లేదు. రాజకీయాలతో నాకు సంబంధం లేదు” అన్నారు.