ఢీకొన్న రెండు బస్సులు.. ఐదుగురి మృతి.. 70 మందికి గాయాలు

5 killed, 70 injured as 2 buses collide head-on in Tamil Nadu

చెన్నైః తమిళనాడు లో ఘోర రోడ్డు ప్రమాదం సభవించింది. రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఈరోజు ఉదయం కడలూరు-పన్రుటి మధ్య రెండు ప్రైవేటు బస్సులు వెళ్తున్నాయి. కడలూరు జిల్లా నెల్లికుప్పం సమీపంలోని పట్టంబాక్కం వద్దకు రాగానే ఒక బస్సు ముందు టైరు పేలింది. దీంతో అది అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో బస్సును బలంగా ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 70 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కడలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కాగా, ఈ ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50వేలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు.