మణిపూర్‌లో మిలిటెంట్ల దాడి .. నలుగురు పోలీసు కమాండోలు, ఒక జవానుకు గాయాలు

నిన్న నలుగురు స్థానికుల కాల్చివేత

4 police commandos, 1 BSF jawan injured in attack by militants in Manipur

ఇంఫాల్‌ః హింస తర్వాత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న మణిపూర్‌లో మిలిటెంట్లు పేట్రేగిపోయారు. మరోరే పట్టణంలో ఈ ఉదయం జరిగిన ఆకస్మికదాడిలో నలుగురు పోలీసు కమాండోలు, సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్ఎఫ్) చెందిన జవాను తీవ్రంగా గాయపడ్డారు. కాగా, నిన్న తౌబాల్ జిల్లాల్లో సాయుధ దుండగులు, స్థానికులకు మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు పౌరులు కాల్చివేతకు గురయ్యారు. అంతలోనే నేడు మిలిటెంట్లు దాడికి తెగబడడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.

నిన్నటి ఘటనలో నిందితుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. ఇలాంటి చర్యలను ఖండిస్తున్నట్టు ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ తెలిపారు. అమాయక ప్రజల ప్రాణాలు తీయడాన్ని ఉపేక్షించబోమని, నిందితులు ఎంతటివారైనా శిక్షిస్తామని హెచ్చరించారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. కాగా, ఈ ఘటన తర్వాత రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు.