దేశంలో కొత్తగా 358 కరోనా కేసులు

కేరళలో ముగ్గురి మృతి

corona virus
corona virus

న్యూఢిల్లీః కరోనా మహమ్మారి దేశాన్ని మరోమారు కలవరపెడుతోంది. గత 24 గంటల్లో దేశంలో 358 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకొని దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి పెరిగింది. కేరళలో కొవిడ్ వేరియంట్ జేఎన్.1 కేసులు గుర్తించిన నేపథ్యంలో కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా తాజాగా ముగ్గురు మరణించారు. ఈ మూడు మరణాలు కేరళలోనే నమోదయ్యాయి. తాజా మరణాలతో కలుపుకొని దేశవ్యాప్తంగా కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 5,33,327కు పెరిగింది.

తాజా కేసులు కేరళ, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రలో నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఆ శాఖ వెబ్‌సైట్ ప్రకారం కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,44,70,576కు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. ఇక, కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు దేశంలో 21 నమోదయ్యాయి. కరోనా మళ్లీ కొత్త రూపంలో బుసలు కొడుతుండడంతో రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి. కరోనా కట్టడికి చర్యలు ప్రారంభించాయి. చాలా రాష్ట్రాలు మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశాయి.