జనగామలో 31న రైతు వేదిక ప్రారంభించనున్న సిఎం కెసిఆర్
హైదరాబాద్: సిఎం కెసిఆర్ ఈ నెల 31న (శనివారం) మధ్యాహ్నం 12.30 గంటలకు జనగామ జిల్లాలో రైతు వేదికను ప్రారంభించనున్నారు. వేదిక వద్ద ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని సందర్శిస్తారు. అనంతరం రైతులు, ప్రజలను ఉద్దేశించి సిఎం ప్రసంగించనున్నారు. రైతు వేదిక నిర్మాణం వెనుక ఉన్న ఉద్దేశాన్ని, ఆవశ్యకతను, వాటి ద్వారా జరిగే కార్యకలాపాలను రైతులకు వివరించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రైతుబంధు జిల్లా, మండల, గ్రామ కమిటీలను కార్యక్రమానికి ఆహ్వానించారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమానికి హాజరుకానున్నారు.
రైతులంతా ఒకే చోట చేరి వ్యవసాయం, సాగు చేసే పంటలపై చర్చించుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలను నిర్మిస్తోంది. ఆన్లైన్లో సిఎం కెసిఆర్ నేరుగా రైతులతో మాట్లాడేలా.. రాష్ట్రవ్యాప్తంగా రూ.573 కోట్లతో 2,604 వేదికలను నిర్మిస్తున్నారు. సమావేశాలు, చర్చలు నిర్వహించడంతోపాటు గోడౌన్గా ఈ వేదికలను ఉపయోగించనున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/