బిఆర్ఎస్ కచ్చితంగా బిజెపికి బీ-టీమ్ః వీహెచ్

కెసిఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే బండి సంజయ్‌ని తప్పించారు.. వీహెచ్

Congress Leader V Hanumantha Rao
Congress Leader V Hanumantha Rao

హైదరాబాద్‌ః బిఆర్ఎస్, బిజెపి రెండు పార్టీలు ఒక్కటేనని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు శనివారం ఆరోపించారు. సిఎం కెసిఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనే బిజెపి తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ని తప్పించారని విమర్శించారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పినట్లుగా బిఆర్ఎస్ కచ్చితంగా బిజెపికి బీ-టీమ్ అన్నారు. బిఆర్ఎస్ పేరు మార్చి ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందన్నారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన ఓబీసీల ఐక్య వేదిక సమావేశంలో వీహెచ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్టుకు మోడీ ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదని నిలదీశారు. దేశంలో ఇప్పుడు రాహుల్ గాంధీ హవా నడుస్తోందని, ప్రజల్లో రాహుల్ క్రేజ్ పెరిగిందన్నారు.

కర్ణాటకలో బీసీలు, మైనార్టీలు కాంగ్రెస్ పక్షాన నిలిచారని, అందుకే భారీ విజయం దక్కిందన్నారు. బీసీ గర్జన పేరుతో తమ బలం చూపిస్తామని, తమ డిమాండ్లు అధిష్ఠానాం ముందు పెడతామని చెప్పారు. తమ బలాన్ని చూపిస్తే అగ్ర నాయకులు ఒప్పుకుంటారన్నారు. తాము అగ్రకులాల నాయకులకు వ్యతిరేకం కాదని, కానీ తమ డిమాండ్ పాత వారికీ.. బీసీలకు స్థానం కల్పించాలన్నారు. కనీసం 40 శాతం సీట్లు బీసీలకు ఇవ్వాలన్నారు. బీసీలు గతంలో అవమానాలు భరించారని, ఇప్పుడాపరిస్థితి లేదన్నారు.