పవన్‌ కల్యాణ్‌ రిషికొండ పర్యటనపై పోలీసుల నోటీసులు

రుషికొండకు ఎదురుగా ఉన్న రోడ్డులోనే వెళ్లాలని కండిషన్

Police notice on Pawan Kalyan visit to Rushikonda

విశాఖః జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలోని రుషికొండ పరిశీలనకు వెళ్తున్న పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. జోడుగుళ్లపాలెం నుంచి ఎవరినీ అనుమతించబోమని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ర్యాడిసన్ బ్లూ హోటల్ నుంచి కేవలం పవన్ వాహనానికి మాత్రమే అనుమతి ఉందని చెప్పారు. రుషికొండకు ఎదురుగా ఉన్న రోడ్డులోనే పవన్ వెళ్లాలని, కొండపైకి వెళ్లకూడదని కండిషన్ పెట్టారు. కావాలనుకుంటే గీతం యూనివర్శిటీ వద్ద మీడియాతో మాట్లాడవచ్చని చెప్పారు.

మరోవైపు వారాహి యాత్రలో భాగంగా నిన్న చేసిన వ్యాఖ్యలకు గాను పవన్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించారని, అలా వ్యవహరించకుండా ఉండాల్సిందని అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని, విద్వేషాలు రగిల్చే వ్యాఖ్యలు చేయరాదని, పోలీసుల నిబంధనలు పాటించాలని, షెడ్యూల్ వివరాలను ముందే ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.