మిజోరం ముఖ్యమంత్రిగా లాల్దుహోమా ప్రమాణస్వీకారం

ZPM leader Lalduhoma takes oath as Mizoram CM

ఐజ్వాల్: మిజోరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ పార్టీ అధినేత లాల్దుహోమా ప్రమాణస్వీకారం చేశారు. ఐజ్వాల్‌లోని రాజ్‌భవన్‌ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు జెడ్‌పీఎం ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇటీవలే జ‌రిగిన మిజోరం అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 40 స్థానాల‌కు గానూ 27 నియోజ‌క‌వ‌ర్గాల్లో జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ పార్టీ గెలుపొంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవ‌త‌రించిన విషయం తెలిసిందే.

74 ఏండ్ల వ‌య‌సున్న లాల్దుహోమా.. ఐపీఎస్‌గా త‌న కెరీర్‌ను ప్రారంభించారు. గోవా, ఢిల్లీలో ఆయ‌న ఐపీఎస్‌గా ప‌ని చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఇంచార్జి ఆఫీస‌ర్‌గా కూడా ప‌ని చేశారు. అదే స‌మ‌యంలో రాజ‌కీయాలకు ఆక‌ర్షితుడైన లాల్దుహోమా త‌న ఐపీఎస్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. రాజకీయాల్లోకి వచ్చి 1984లో లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ‌స్వీకారం చేశారు.