యువగళం 65 వ రోజు హైలైట్స్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం యాత్ర 65 వ రోజు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం యువగళం యాత్ర అనంతపురం జిల్లాలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. మొదటి నుండి కూడా లోకేష్ యాత్రకు ప్రజలు బ్రహ్మ రధం పడుతూ వస్తున్నారు. లోకేష్ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
నేడు 65వ రోజు లోకేష్ పాదయాత్ర శింగనమల నియోజకవర్గంలోని జంబులదిన్నె క్యాంప్ సైట్నుంచి ప్రారంభమైంది. సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం తర్వాత పాదయాత్ర మొదలైంది. నాగులగుడ్డం తాండా వద్ద తాండా వాసులు లోకేష్ను కలిసి తమ సమస్యలను ఆయనకు విన్నవించారు. దీనికి లోకేష్ స్పందిస్తూ..‘‘ టీడీపీ అధికారంలోకి రాగానే గత ప్రభుత్వంలో అమలుచేసిన పథకాలన్నింటినీ పునరుద్దరిస్తాం. మీకు రావాల్సిన నిధులు, ఉద్యోగాలు మీకే దక్కేలా చర్యలు తీసుకుంటాం’’ అని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హంద్రీనీవా పనులను పూర్తిచేసి గొలుసుకట్టు చెరువులకు నీరందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. వెస్ట్ నర్సాపురం వాసులు కోరిన విధంగా చెరువులకు నీరందించి సాగు, తాగునీటి కష్టాలు తీరుస్తామన్నారు.