ముందు కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందించాలిః షర్మిల హితవు

సజ్జల వ్యాఖ్యలపై స్పందించిన షర్మిల

YS Sharmila React on Sajjala Ramakrishna Reddy Comments

హైదరాబాద్‌ః ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. గతంలో తాను తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించినప్పుడు తమకేమీ సంబంధం లేదన్న సజ్జల, ఇప్పుడు తాను కాంగ్రెస్ కు మద్దతిస్తుంటే ఎందుకు మాట్లాడుతున్నారని షర్మిల ప్రశ్నించారు.

తనపై మాట్లాడడం కాదని, ఏపీ పరిస్థితులపై కెసిఆర్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల సజ్జల స్పందించాలని హితవు పలికారు. తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని గద్దె దింపే శక్తి కాంగ్రెస్ కే ఉందని, అందుకే ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నానని షర్మిల స్పష్టం చేశారు.

“నేను తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజే… ఆమె పార్టీ పెడితే మాకేంటి సంబంధం అన్న వ్యక్తి సజ్జల. ఈరోజు ఆయన ఏ సంబంధం ఉందని మాట్లాడుతున్నారు? నేనయితే ఏ సంబంధం లేదనే అనుకుంటున్నాను. మరి మీరు మాట్లాడుతున్నారంటే సంబంధం కలుపుకుంటున్నారని అనుకోవాలా? దీనికి సజ్జల సమాధానం చెప్పాలి. ఓవైపు సిఎం కెసిఆర్ బహిరంగంగానే సింగిల్ రోడ్ అయితే ఆంధ్రా, డబుల్ రోడ్ అయితే తెలంగాణ… చీకటి అయితే ఆంధ్రా, వెలుగు అయితే తెలంగాణ అంటున్నారే… దీనికి సజ్జల ఏం సమాధానం చెబుతారు?” అని ప్రశ్నించారు.