వైఎస్‌ఆర్‌సిపి సర్కార్ నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలిః షర్మిల

23 వేల పోస్టుల భర్తీ అని చెప్పి 6 వేల పోస్టులకు నోటిఫికేషన్‌పై ఆగ్రహం

Sharmila

అమరావతిః డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఉద్యోగాల సంఖ్య తక్కువగా ఉండటంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. నిరుద్యోగులను దగా చేస్తున్నారని నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారని దుయ్యబట్టారు. తమను ఆపాలని చూసేవారు ముమ్మాటికీ నియంతలేనని అన్నారు.

‘‘వైఎస్‌ఆర్‌సిపి నియంత పాలనలో మెగా డీఎస్సీనీ దగా డీఎస్సీ చేశారని నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారు. మా చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టారు. ఇనుప కంచెలు వేసి మమ్మల్ని బందీలు చేశారు. నిరుద్యోగుల పక్షాన నిలబడితే అరెస్టులు చేస్తున్నారు. మమ్మల్ని ఆపాలని చూసే మీరు ముమ్మాటికీ నియంతలే. ఇందుకు మీ చర్యలే నిదర్శనం. సీడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 23 వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి 6 వేలకే నోటిఫికేషన్ ఇచ్చినందుకు వైఎస్‌ఆర్‌సిపి సర్కార్ నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలి’’ అని షర్మిల డిమాండ్ చేశారు.