ఆన్లైన్ టెస్టులకే కంపెనీల ప్రాధాన్యత
హైయర్ ఎడ్యుకేషన్ చేయాలన్నా, ఉద్యోగం పొందాలన్నా ఆన్లైన్ టెస్టులకు సిద్ధపడాల్సిందే. ఎందుకంటే ఇటీవలకాలంలో ఆన్లైన్ టెస్టులకే కంపెనీలు ప్రాధాన్యతనిస్తున్నాయి. బ్యాంకుల దగ్గర నుంచి ఇన్సూరెన్స్ కంపెనీల దాకా అన్ని పోటీ పరీక్షలలోనూ ఒకటే విధానం. అదే ఆన్లైన్ పరీక్ష. ప్రభుత్వం నిర్వహించే కొన్ని పరీక్షల్లో కూడా ఆన్లైన్ టెస్టులు నిర్వహిస్తున్నారు.
ఏదో కొంచెం ఆర్థిమెటిక్, మరికొంచెం ఇంగ్లీష్ నేర్చుకొని జి.కె అంశాలను గుర్తు పెట్టుకుని వాటిని దింపేస్తే చాలు అనుకునే వారికి ఇది నిజంగా గడ్డు పరీక్షే. నిజంగా ఆన్లైన్ పరీక్షలంత కష్టంగా ఉంటాయా…? లేక అందరూ అనవసరంగా భయపడుతున్నారా…? ఒక్కసారి విశ్లేషిద్దాం.
ఏ పోటీ పరీక్షలోనైనా మొత్తం నాలుగు లేదా అయిదు విభాగాలు ఉంటాయి. ఈ అయిదు విభాగాలకు సంబంధించిన ప్రశ్నలు మొత్తం, పరీక్షా పత్రం మీద ఇవ్వబడతాయి. వాటికి సమాధానాలు ఓఎంఆర్ షీట్ మీద గుర్తించవలసి ఉంటుంది. కానీ ఆన్లైన్ పరీక్షలో అలా కాదు. అభ్యర్థి వివరాల దగ్గర్నుండి ప్రశ్నల వరకు అన్ని కంప్యూటర్ స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతాయి.
వాటికి సమాధానాలు కూడా కంప్యూటర్లోనే గుర్తించవలసి ఉంటుంది. ఇంతే…ఈ మాత్రం దానికి అనవసరంగా కంగారు పడి ఆన్లైన్ టెస్టు అంటేనే భయపడిపోతూ ఉంటారు. రెండు పరీక్షలకు ప్రధానమైన తేడా కంప్యూటర్ మాత్రమే. అది కూడా సాధారణ పరిజ్ఞానం సరిపోతుంది. ఏ మాత్రం భయపడవలసిన అవసరం లేదు.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రముఖ తెలుగు దినపత్రికల యొక్క అనుబంధ ఆన్లైన్ విద్యా ఎడిషన్లన్నీ ఈ ఆన్లైన్ మోడల్ పేపర్లను ఒక ప్యాకేజీ రూపంలో అందిస్తున్నాయి. మొత్తం మూడు పేపర్ల ధర అయిదు వందల రూపాయల వరకు ఉం టుంది. ఒక రకంగా చూస్తే అభ్యర్థులలో ఈ ఆన్లైన్ పరీక్షల పట్ల భయం కలగడానికి ఈ ధోరణి కూడా కొంతవరకు కారణమేమో..!
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/movies/