కర్ణాటక మాదిరి తెలంగాణలో కూడా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాంః తుమ్మల

ఖమ్మంలో రోడ్ షో నిర్వహించిన తుమ్మల

We will implement six guarantees in Telangana like Karnataka: Tummala

ఖమ్మంః అధికార బిఆర్ఎస్ పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతూ, భూకబ్జాలు చేస్తున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. యథా రాజా తథా ప్రజా అన్నట్టుగా బిఆర్ఎస్ నేతల శైలి ఉందని విమర్శించారు. కార్పొరేటర్లు బరితెగించి దందాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బెదిరింపులకు పాల్పడే వారిని కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలే చెప్పులతో కొడతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తుమ్మల రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు విమర్శలు గుప్పించారు.

తెలంగాణను ఇచ్చిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని తుమ్మల చెప్పారు. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన ఘనత గాంధీ కుటుంబానిదని అన్నారు. మన దేశంలో మత సామరస్యం దెబ్బతినేలా కొన్ని శక్తులు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. విద్వేషాలకు తావు లేకుండా భారత్ జోడో యాత్రతో దేశాన్ని రాహుల్ గాంధీ ఏకం చేశారని కొనియాడారు. సోనియమ్మకు మహిళల కష్టాలు తెలుసని చెప్పారు. కర్ణాటక మాదిరి తెలంగాణలో కూడా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు.